వడ్లమన్నాడు గ్రామం లోని మురికి కాలువలో పూడిక తీత పనులకు అంచనాలు తయారు చేయండి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం:
వడ్లమన్నాడు గ్రామం లోని మురికి కాలువలో పూడిక తీత పనులకు అంచనాలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలంలోని వడ్లమన్నాడు గ్రామంలో మురికి కాలువను పరిశీలించారు.
ఈ సందర్భంగా స్థానిక నాయకులు మల్లిపెద్ది సుబ్రహ్మణ్యం, గరిసపూడి రాంబాబు తదితర గ్రామస్తులు మాట్లాడుతూ మురికి కాలువలో పూడిక ఎక్కువగా పేరుకుపోయి గట్టిపడిపోయిందని, దీంతో వరదల సందర్భంగా వరద నీరు సరిగా ప్రవహించక పంట పొలాలను ముంచి వేయడంతో చాలా నష్టపోతున్నామని పూడిక తొలగించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.
జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ కాలువలో పూడికను తొలగించేందుకు అంచనాలు సిద్ధం చేయాలని, పూడికను పూర్తిగా తొలగించి వరద నీరు పొంగి పంట పొలాలు మునిగిపోకుండా సజావుగా ప్రవహించే విధంగా ఏర్పాటు తప్పనిసరిగా చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అంతకు మునుపు జిల్లా కలెక్టర్ గూడూరు నుండి వడ్లమన్నాడుకు వచ్చే మార్గంలో నక్కలపాలెంలో గ్రామస్తులు తాము 50 కుటుంబాలు ఉంటున్నామని, గ్రామానికి రహదారి మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేయగా పరిశీలిస్తామని చెప్పారు.
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జలవనరుల శాఖ డ్రైనేజీ డివిజన్ కిరణ్ బాబు, గుడ్లవల్లేరు మండల తహసిల్దారు లోకరాజు, ఎంపీడీవో ఇమ్రాన్ పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Post a Comment