నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!
అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు
ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు
ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.
1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.
నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషనరీ గురు పట్టా ఉండాలని షరతు పెట్టారు. దాంతో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ తమ గ్రామంకు సమీపంలో ఉన్న ఓల్డ్ డాల్చ్ గ్రామంలోని చర్చిలో సహాయ మతగురువుగా ఏడాదికాలం పనిచేసి గురు పట్టా పొందారు.
తన మిత్రుడు బి.డబ్ల్యూ ఫాక్స్ తో కలసి మార్చి 3, 1841న ఇంగ్లాండ్ నుంచి ఓడలో ప్రయాణమై జులై 4, 1841 న మద్రాసు చేరుకొన్నారు. రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ రెండు నెలల పాటు అక్కడ ఒక ఆంధ్రునికి జీతమిచ్చి ఆయన వద్ద తెలుగు భాషను నేర్చుకొన్నారు. ఆ తర్వాత ఆయన గుంటూరుకు చేరుకొని తనను ఆహ్వానించిన గోల్డింగ్ హమ్ ను కలుసుకున్నారు.
గోల్డింగ్ హమ్ కృష్ణా, గుంటూరు జిల్లాలకు కలెక్టర్ గా ఉండేవారు. గుంటూరులో పాఠశాలను స్థాపించి విద్యావ్యాప్తి ఇక్కడ నుంచే ప్రారంభించమని రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ను ఆయన కోరారు. ఆ అభ్యర్ధనను తిరస్కరించిన గోల్డింగ్ హమ్ తనకు తొలుత సూచించిన సముద్రతీరంలో ఉన్న నిరక్ష్యారాస్యులు.. పేదలు ఎక్కువగా ఉన్న బందరుకు అక్టోబర్ 28, 1841 న చేరుకొన్నారు. మేజర్ అడ్రి ఇంటిలో అతిధిగా ఉండి తన కార్యాచరణ మొదలుపెట్టారు. దాదాపు 20 నెలల కాలం తర్వాత జులై 5, 1843 న గార్డెన్ అనే ఆంగ్లేయాధికారి సహాయంతో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ గుర్రం మీద 17 రోజులు ప్రయాణించి మరల మద్రాసు చేరుకొన్నారు. అక్కడ తెలుగు బాషా పటిమను రాత పరీక్ష... మాట్లాడటంలో పరీక్షా పద్ధతిని పూర్తి చేయవలసి వచ్చింది. మద్రాసులో అప్పటి ఐ.సి .ఎస్. అధికారులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ బాషా పాండిత్యం ప్రత్యేకంగా పరిశీలించి ఉత్తీర్ణుడిని చేశారు. తిరుగు ప్రయాణంలో యువకుడైన మరో విద్యాధికుడైన షార్కీని వెంటబెట్టుకొని వచ్చారు. నాడు తనతో వచ్చిన బి.డబ్ల్యూ ఫాక్స్ కేవలం మాత సంబంధమైన పనిలో నిమగ్నమగుట చేత షార్కీ అవసరం ఆయనకు ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక విశిష్టమైన రోజు. విద్య వైజ్ఞానిక రంగంలో పెనుమార్పునకు పునాది పడిన 1843 నవంబర్ 21 వ తేది ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో నోబుల్ విద్యా సంస్థ సంస్థాపితమైన శుభ దినం. మంచాల రత్నం, అయినాల నాగభూషణం అనే ఇద్దరు విద్యార్థులతో తెలుగు గడ్డపై ఆంగ్ల పాఠశాల " ది నేటివ్ ఇంగ్లీష్ స్కూల్ " అనే పేరుతో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ తన సహచర మిత్రుడైన రెవరెండ్ జె. ఇ. షార్కి ల ఆధ్వర్యంలో ప్రారంభమైంది.
తొలి పాఠం బైబిల్ గ్రంథంలోని ఒక అధ్యాయం. మలి పాఠం భగవద్గీత లోని కొన్ని శ్లోకాలు నోబుల్ గారి నోటి నుంచి వెలువడేవి. క్రమేపి పాఠశాలలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతుండేది.
విదేశీయుడైనప్పటికీ ఆయన నోటి వెంబడి వచ్చే తెలుగు పదాలు వింటున్న విద్యార్థులను వివశుల్ని చేసేవి. ఆయన పాఠం చెప్పే తీరువారిని సమ్మోహనులను చేసేది. ఆయన కేవలం అధ్యాపకునిగానే కాక విద్యార్థులను సచ్చీలురుగా తీర్చిదిద్దేందుకు కృషి చేసేవారు. రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ క్రమశిక్షణ విధానం విద్యార్థులకు ఆదర్శం. భగవంతుడు అయనకు ఇచ్చిన అనితర సాధ్యమైన శక్తియుక్తులను విద్యార్థులు ఆయనలో దర్శించేవారు. ఆయన పట్ల ఎనలేని ఆత్మీయతని విద్యార్థులు ప్రదర్శించేవారు.
రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ గంభీరమైన రూపం ఆరడుగుల ఆజానుబాహుడు .. ప్రసన్నమైన చూపు.. బంగారు వర్ణంతో మెరిసిపోతుండేవారు. ఒక కంటికి మాత్రమే కంటి అద్దాన్ని ధరించేవారట..ఆయన నివాసం నుండి బడికి పోయే సమయంలో చేతిలో ఒక బెత్తం ఉండేదని ఆయన గూర్చి రచించిన పుస్తకాలలో వర్ణించారు. తన ఫోటో అనేది లేకుండా ఆయన జాగ్రత్త వహించేవారు. ఆఖరికి పెయింటింగులలో సైతం తన చిత్రాన్ని రూపొందించరాదని కోరేవారు. అందుకే నేటికీ ఆయన హృదయాన్ని తప్ప రూపాన్ని దర్శించే భాగ్యం తర్వాత తరాలవారికి దక్కలేదు. ఆయన జీవితమంతా కఠిన బ్రహ్మచర్య దీక్షతోనే గడిపారు.
1864 సంవత్సరం లో ఆ పాఠశాల రెండవ శ్రేణి ( ఇంటెర్మీడియర్ తరగతి ) బోధించే కళాశాలగా మారింది. అదే ఏడాది నవంబర్ 1 వ తేదీన బందరులో పెద్ద ఉప్పెన వచ్చింది. 55 వేలమంది ఉన్న నాటి జనాభాలో 30 వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ ఉప్పెన వలన వాతావరణం కలుషితమై పోయింది. ఊరంతా జ్వరాలు..రక్తభేదులు వంటి జబ్బులతో ప్రాణాలతో బైటపడినవారు బాధపడ్డారు. అదే సమయంలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. స్థల మార్పునకు కొద్దికాలం ఇంగ్లాండ్ కు వెళ్లాల్సిందిగా ఆయనకు సూచించారు. అయితే ఆయన తన మిత్రుల సూచనను అంగీకరించలేదు. మరింతగా ఆరోగ్యం క్షీణించడంతో అక్టోబర్ 17, 1865 సాయంకాలం నెమ్మదిగా నిత్య విశ్రాoతి లోనికి చేరుకొన్నారు. ఆయన ఎప్పుడు చనిపోయిందో ఆయన దగ్గర ఉన్నవారు గుర్తించలేదు . మర్నాటి సాయంకాలం ఆయన తనువు చాలించినట్లు గుర్తించారు.
ఆయన నిత్యం పాఠశాలకు వచ్చే పల్లకిలోనే సెయింట్ మేరీస్ చర్చి ( ఇంగ్లీష్ చర్చి ) మోసుకువెళ్లారు. ఆయన అంతిమ యాత్రలో ఒక ఆంగ్లేయుడు..మహ్మదీయ మతం నుండి క్రైస్తవుడైన ఒకరు..బ్రాహ్మణుడి నుంచి క్రైస్తవుడైన ఒకరు.. శూద్రుడైన క్రైస్తవుడు..మరొక పంచమకుడైన మరో క్రైస్తువుడు పల్లకిని మోశారు.
1865 వరకు కృష్ణాజిల్లా కలెక్టర్ కార్యాలయం ..హై స్కూల్ కళాశాల ఉన్న ప్రాంతంలో ఉండేది. ఆ తర్వాత కృష్ణాజిల్లా కలెక్టర్ కార్యాలయం చిలకలపూడి ప్రాంతానికి తరలిపోయింది. ఆ తర్వాత పాత స్థలంలో పాత నిర్మాణంకు మరమ్మత్తులు చేసి రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ పేరిట హాల్ నిర్మించారు. పాఠశాల..కళాశాలను నోబుల్ పేరిట పిలవనారంభించారు. 1893 లో మొదటి తరగతి కళాశాలగా మారింది. 1894 లో మహిళా విద్యార్థినులు ప్రవేశించారు.
ఉమ్మిడి మద్రాసు రాష్ట్రంలో ఒక మహిళ పట్టభద్రురాలు కావడం మొట్టమొదట నోబుల కళాశాల నుండే జరిగింది. 1897 - 98 కాలంలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ గారి శిష్యుడైన మంచాల రత్నంగారి మనుమరాలు మంచాల కృష్ణమ్మ ఆమె కావడం విశేషం. అలాగే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఏం.ఏ. డిగ్రీని అందుకున్నవారు వెలగపూడి సుందర రామయ్య. ఆయన నోబెల్ కళాశాలలో బి ఏ డిగ్రీ చదివిన అనంతరం మద్రాసు విశ్వవిద్యాలయంలో ఏం ఏ చదివి సర్వోన్నుతుడిగా ఉత్తీర్ణత సాధించారు.
1918 లో నోబుల్ కళాశాల ప్లాటినం జూబిలీ జరుపుకొంది. ఆ సందర్భంగా సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ సెంటర్ విభాగం ప్రారంభించబడింది. ఈ విధంగా 1938 సంవత్సరం వరకు నోబుల్ కళాశాల వర్ధిల్లింది. చార్లెస్ ట్రావేరియన్ అనే ఇంగ్లాండ్ విద్యావేత్త నోబుల్ కళాశాలను దక్షిణ భారత క్రైంబ్రిడ్జి విశ్వవిద్యాలయం అని అభివర్ణించారు. కాలగతిలో ఎన్నో మార్పులు రావడం సహజం లిండ్ సే కమిషన్ సలహా మేరకు 1938 సంవత్సరం తర్వాత నోబుల్ కళాశాల గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో సంలీనం కావాల్సిఉండగా అది పూర్తిగా కార్యరూపం దాల్చలేదు. నోబుల్ కళాశాల కొంతకాలం చరిత్ర పూతల నుంచి తప్పుకొంది. హైస్కూల్ యధాతదంగానే కొనసాగింది. అయినా బహిరంగంగా తన అస్థిత్వాన్ని పోగొట్టుకొన్నప్పటికీ రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ మహాశయుని పవిత్రాశయం మాత్రం అలానే కొనసాగింది. త్రివేణిలోని సరస్వతి వలే ఎందరో హృదయాల్లో అంతర్లీనంగా ప్రవహిస్తూనే ఉంది. 1966 సంవత్సరంలో గంగా ఝరియై పెల్లుబికి తన రూపాన్ని ప్రస్ఫుటం చేసుకొంది.
ఎందరో ప్రముఖులు ఇక్కడ చదువుకున్నారు....
1880 సంవత్సరంలో ముగ్గురు ప్రఖ్యాత వ్యక్తులు బందరుకు ఎంతో ఖ్యాతిని తీసుకువచ్చారు. వారిలో శ్రీ కోపల్లె హనుమంతరావు , శ్రీ ముట్నూరి కృష్ణారావు, శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్యల విద్యాబ్యాసం నోబుల్ కళాశాలలో జరగడం గమనార్హం. అలాగే ప్రముఖ సంపాదకులు నార్ల వేంకేటేశ్వర రావు, శ్రీ విశ్వనాధ సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, అయ్యదేవర కాళేశ్వరరావు, ఇలా వందలాదిమంది ప్రముఖులు నోబుల్ కళాశాల ఆణిముత్యాలే !!
ఎన్.జాన్సన్ జాకబ్,
మచిలీపట్నం
Comments
Post a Comment