మచిలీపట్నం :
వీధి కుక్కల అరాచకం వల్ల ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. సోమవారం ఉదయం స్కూలుకు వెళ్తున్న శేషగిరిరావు పై వీధి కుక్కలు వెంటపడ్డాయి. ఒకటో, రెండో అంటే పర్వాలేదు. కొంతమేర తప్పించుకోవచ్చు. దాదాపు నాలుగు కుక్కలు పైగా విచక్షణ మరిచి వెంట పడటంతో, తన స్కూటీపై వెళ్తున్న మాస్టారు వాటిని తప్పించబోయి, అదుపుతప్పి రోడ్డు మీద పడ్డాడు. చుట్టుపక్కల జనం కుక్కల్ని తరిమి కొట్టారు. కాలు చీలమండ దగ్గర వేలాడుతూ రక్తం కారుతుండటంంతో వెంటనే 108 కి ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చి హుటాహుటిన ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. వీధి కుక్కల వల్ల కాలు ప్రమాదంలో పడ్డ ఆ మాస్టారు పెడన మండలం ఉరిమి ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న శేషగిరిరావు అని తెలిసింది.
వీధి కుక్కల ఆటలకు కట్టడి లేదా?
ఇటీవల సుప్రీంకోర్టు కూడా వీధి కుక్కల్ని నగరానికి దూరంగా కట్టడి చేయాలని తీర్పు ఇవ్వడం జరిగింది.
పట్టించుకోని నగరపాలక సంస్థ:
వీధి కుక్కల నియంత్రణకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలి. నగరంలో ఇటీవల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ప్రక్రియ మందగించిందని చెప్పవచ్చు. వీధి కుక్కల్ని ఇప్పటికైనా ప్రత్యేక షెల్టర్లలో నగరానికి దూరంగా ఉంచి, ప్రజలపై వీధి కుక్కలు స్వైర్య విహారం చేయకుండా కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఆ చర్యలేమి చేపట్టక పోగా వీధి కుక్కల నియంత్రణలో నగరపాలక సంస్థ సిబ్బంది పూర్తిగా విఫలం అయ్యారని నగర ప్రజలు అనుకోవడం గమనార్హం. ప్రజల భద్రతపై మరీ ఇంత నిర్లక్ష్యమా? ఇది పరిపాలన వైఫల్యం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ సిబ్బంది స్పందించి వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత భయంకరంగా మారుతుంది. పన్నులు కడుతున్న ప్రజలకు రక్షణ ఇవ్వలేని అధికారులు ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. నగరపాలక సంస్థ కుక్కల నియంత్రణకు ప్రణాళిక ప్రకారం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది.
Comments
Post a Comment