వ్యవసాయానికి బలం, రైతులకు భరోసా – కేడీసీసీ బ్యాంక్ : కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్
ఉయ్యురు :
పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు పట్టణంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం నూతన భవనాన్ని కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం సహకార సంఘం అధ్యక్షులు వాసు కూనపరెడ్డి ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది.
ఈ సందర్భంగా కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్ మాట్లాడుతూ సహకార రంగం రైతులకు నిజమైన ఆర్థిక భరోసా కల్పించే బలమైన వేదికగా మారిందని తెలిపారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో సహకార బ్యాంకు, సహకార సంఘాల ఆధ్వర్యంలో పాడి పరిశ్రమ, వ్యవసాయం, అనుబంధ రంగాలలో ప్రజలకు తక్కువ వడ్డీతో రుణ సదుపాయాలు కల్పిస్తూ వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా వ్యవసాయ రుణాలు మరియు మహిళా సంఘాలకు రుణాలు అందిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో, రాష్ట్రంలో కృష్ణాజిల్లా సహకార బ్యాంకు మొదటి మూడు స్థానాల్లో నిలవడం గర్వకారణమని తెలిపారు.
అన్ని సహకార సంఘాల్లో కంప్యూటరైజేషన్ పూర్తి అయ్యిందని, రైతులు ఈ సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే పీఎంఈజీపీ (PMEGP) పథకం ద్వారా యువత స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించుకుని వ్యాపారాల్లో ముందుకు రావాలని సూచించారు. కేడీసీసీ బ్యాంకును వాణిజ్య బ్యాంకులకు ఏమాత్రం తగ్గకుండా మరింత అభివృద్ధి పరచడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. బ్యాంకు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సహకార రంగం మరింత అభివృద్ధి చెందుతోందని అన్నారు.
ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ ఉయ్యూరు ప్రాథమిక సహకార పరపతి సంఘం కార్యాలయాన్ని రూ.49 లక్షల వ్యయంతో నిర్మించడం అభినందనీయం అని తెలిపారు. ఈ భవనం ద్వారా రైతులకు సేవలు మరింత అందుబాటులోకి రావడంతో పాటు, ఏర్పాటు చేసిన దుకాణాల ద్వారా అద్దె ఆదాయం పొందే అవకాశంతో సంస్థ ఆర్థికంగా బలపడుతుందని, పరిపాలన సౌలభ్యం కోసం అవసరమైన మౌలిక వసతులకు నిధులు సమకూర్చుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. రైతులు, ఆర్థికంగా బలహీన వర్గాల ప్రజలకు రూ.30 వేల నుండి రూ.20 లక్షల వరకు రుణాలు అందించడం ద్వారా వారి ఆదాయాలు పెరిగేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాల కింద మొత్తం ₹10 కోట్ల విలువైన రుణ చెక్కులను కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్ , ఎమ్మెల్యే బోడే ప్రసాద్ 100 మందికి పైగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ ఆర్థిక సహాయం రైతులు, మహిళా సంఘాలకు మరింత ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగిస్తుందని తెలిపారు.
అనంతరం చైర్మన్ నెట్టెం రఘురామ్ ఉయ్యూరు బ్రాంచ్ను సందర్శించి, బ్యాంకు సేవలపై ప్రజలతో నేరుగా మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. బ్రాంచ్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Post a Comment