Skip to main content

జగన్మోహనావతారమెత్తిన మూడు నగరాల మాలిక "మావిగన్"!?

 "బాహ్య చక్షువులతో చూడలేని, కేవలం గ్రాఫిక్స్ లో మాత్రమే చూడగలిగే అమరావతి  రెండు లక్షల కోట్ల నిధుల (ప్రస్తుత లెక్కల ప్రకారం) అంచనాతో ఊహాలోకంలో విహరింప చేస్తుంటే, కేవలం ఇరవై వేల కోట్ల అంచనాతో జగన్మోహనా వతారమెత్తిన మూడు నగరాల మాలిక మావిగన్" ఆంధ్ర రాజకీయాలను రసకందాయంలో పడవేసింది.


          తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశమైన పదం "మావిగన్". ఎందుకంటే ఏమాత్రం మొహమాటం లేకుండా, తన అభిప్రాయాన్ని ముక్కుసూటిగా, ఆచరణ సాధ్యమయ్యేలా మాట్లాడగలిగే నేత యెండూరి సందిటి జగన్ మోహన్ రెడ్డి నోటి నుండి వచ్చిన పదం మావిగన్!
         కరోనా సమయంలో జగన్ మాటలు గుర్తున్న వారెవరైనా జగన్ ముక్కుసూటి తనాన్ని అంగీకరించాల్సిందే. రానున్న రోజుల్లో కరోనాతో సహజీవనం చేయాల్సిందే అని ముఖ్యమంత్రి హోదాలో జగన్ చెప్పిన మాటలు అత్యంత వివాదాస్పద మైనప్పటికీ తర్వాతి కాలంలో జగన్ చెప్పిన మాటని అందరూ అయాచితంగానే అంగీకరించాల్సి వచ్చింది. ప్రభుత్వ సేవలను మీ ఇంటికే డోర్ డెలివరీ చేస్తాను అని ప్రకటించినప్పుడు వికటాట్టహాసం చేసిన వారు, అదే వ్యవస్థను అంగీకరించలేక, తిరస్కరించలేక నానా తిప్పలు పడ్డారు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం ను ప్రతిపాదించి, పారిశ్రామికవేత్తలతో సమావేశాలను వైజాగ్ లో నిర్వహించినపుడు వేలెత్తి చూపిన నాయకులు.... నేడు విశాఖపట్నం రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ అని ప్రకటించక తప్పలేదు.
       అన్ని గన్ లు పేలకపోవచ్చు ...కానీ జ'గన్' నోటి నుండి వచ్చిన మాట ఖచ్చితంగా పేలుతుందని 2019 ఎన్నికలలో తాను ప్రకటించిన మ్యానిఫెస్టోను దాదాపుగా అమలుచేసి తన నైజాన్ని జగన్ ఆంధ్రరాష్ట్రానికి చాటాడు.  రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ కు ఇవ్వాలని ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కు వచ్చిన స్పందన చూసిన వారెవరికైనా జ'గన్' పేలే గన్ ఆఁ లేక ఏఐ గన్ ఆఁ అన్నది అర్ధమవుతుంది! 
         ఇలాంటి ప్రాక్టికల్ నాయకుడు జగన్ అమరావతి పై మాట్లాడుతూ... "అమరావతి ఎప్పటికీ పూర్తి కాదు" అనీ అందుకే మా హయాంలో మేము విశాఖపట్నం ను రాజధాని గా మార్చాలని ఆలోచన చేశామని చెబుతూ, ఆ ప్రతిపాదన మీకు నచ్చలేదు కాబట్టి ప్లాన్ బి గా దీనిని పరిశీలించండి అంటూ రాష్ట్ర ప్రజల ముందు కొత్త ఆలోచనకు తెరతీశారు.
        ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల తెరపైకి తెచ్చిన రాజకీయ ప్రతిపాదన "మావిగన్" (MAVIGUN). ఇది రాష్ట్ర రాజధాని, అభివృద్ధికి సంబంధించి జగన్ కొత్త వ్యూహం. మావిగన్ అంటే అది ఇంగ్లీష్ పదమో, హిందీ పదమో లేక లాటిన్, గ్రీకు పదమో కాదు! "మావిగన్" అనేది మూడు కీలక నగరాల పేర్ల కలయికతో ఏర్పడిన ఒక క్యాపిటల్ కారిడార్ ప్రతిపాదన.

 మా (MA) - మచిలీపట్నం
 వి (VI) - విజయవాడ 
 గన్ (GUN) - గుంటూరు

         మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మూడు నగరాలను కలుపుతూ సుమారు 110 కిలోమీటర్ల పరిధిలో ఒక "మెగా రాజధాని కారిడార్‌"ను అభివృద్ధి చేయాలనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. ఈ ప్రతిపాదన లోని ప్రధాన అంశం .... ఒకే నగరంపై భారం వేయకుండా, ఈ మూడు నగరాల బలాలను కలిపి ఒక ఆర్థిక, పరిపాలనా కేంద్రంగా తీర్చిదిద్దడం.

మచిలీపట్నం - పోర్ట్, ఎగుమతులు, పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చేయడం.
విజయవాడ - రవాణా, కనెక్టివిటీ, పరిపాలనా కేంద్రంగా ఉపయోగించుకోవడం.
గుంటూరు - విద్యా, వైద్యం, న్యాయ సంబంధిత సంస్థల కేంద్రంగా తయారు చేయడం.

         అమరావతిలో లక్షల కోట్లతో భారీగా నిర్మాణాలు చేపట్టడం కంటే, ఇప్పటికే అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ కేవలం రూ. 20 వేల కోట్లతో ఈ కారిడార్‌ను అభివృద్ధి చేయవచ్చని వైఎస్సార్సీపీ నాయకులు వాదిస్తున్నారు. ఇది భవిష్యత్ తరాల కోసం చేపట్టిన ఒక వ్యూహాత్మక ఆలోచన అని, ఇది రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి పథంలో నడిపిస్తుందని వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు. 
        కాదు కాదు ఇది అమరావతి నిర్మాణానికి అడ్డంకులు సృష్టించేందుకు, ప్రజలను మభ్యపెట్టేందుకు తెచ్చిన మరో కొత్త "డ్రామా" అని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. గతంలో "మూడు రాజధానుల" పేరుతో కాలక్షేపం చేశారని, ఇప్పుడు మళ్ళీ కొత్త పేరుతో ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
         ఇలా ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ "మావిగన్" ప్రతిపాదనపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
           క్లిష్ట పరిస్థితులలో జగన్ మొండిగా ముందుకు వెళతాడు అనేది జగన్ శత్రువులు సైతం ఒప్పుకునే అంశం. ఒక వేళ 2029లో గనుక వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మావిగన్ కార్యరూపంలోకి వస్తుందని ప్రస్తుత పరిణామాలు స్పష్టత నిస్తున్నాయి. దాంతో అమరావతి రియల్ ఎస్టేట్ తప్పనిసరి పరిస్థితులలో నెమ్మదిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని అంటూనే, అమరావతి అభివృద్ధికి 2లక్షల కోట్లు అవసరం అవుతుందని చెబుతూ ఉండటం అయన ద్వంద్వ వైఖరికి నిదర్శనం. మహా నగరాలలో సైతం చదరపు అడుగు నాలుగు వేల రూపాయలతో నిర్మాణం జరుగుతుంటే, అమరావతి నిర్మాణాలకు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల రూపాయలకు టెండర్లు ఖరారవ్వటం రాష్ట్ర ప్రజలకు పలు సందేహాలు కలిగిస్తున్నాయి. 
          జగన్ ప్రతిపాదిత మావిగన్ లోని మచిలీపట్నం దేశంలోనే రెండవ అతి పురాతన మున్సిపాలిటీ కాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి మున్సిపాలిటీ. పంతొమ్మిదవ శతాబ్దంలో వాణిజ్య పరంగా వెలుగొందిన మచిలీపట్నం ఓడరేవు, జగన్ మావిగన్ ప్రతిపాదనతో పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తుందా అనే ఆశలు మచిలీపట్నం నగర ప్రజలలో రేకెత్తుతున్నాయి. 2023, మే 22న మచిలీపట్నం పోర్టు పనులకు శంఖుస్థాపన చేసిన జగన్మోహన్ రెడ్డి, 2026 కల్లా మచిలీపట్నం పోర్టు వినియోగంలోకి వస్తుందని ప్రకటించారు. ప్రణాళికకు అనుగుణంగా 2024 ఏప్రిల్ నాటికే దాదాపు ఎనభై శాతం పోర్టు పనులు పూర్తి చేయగలిగారు. 

       "బాహ్య చక్షువులతో చూడలేని, కేవలం గ్రాఫిక్స్ లో మాత్రమే చూడగలిగే అమరావతి  రెండు లక్షల కోట్ల నిధుల (ప్రస్తుత లెక్కల ప్రకారం) అంచనాతో ఊహాలోకంలో విహరింప చేస్తుంటే,  కేవలం ఇరవై వేల కోట్ల అంచనాతో జగన్మోహనావతారమెత్తిన మూడు నగరాల మాలిక మావిగన్"  ఆంధ్ర రాజకీయాలను రసకందాయంలో పడవేసింది.

        అమరావతి - మావిగన్ లపై ఆంధ్రప్రదేశ్ లోని మేధావులు, సామజికవేత్తలు, ఆర్థికవేత్తలు, ఉన్నతాధికారులు, వివిధ వర్గాల మధ్య  విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు కి నచ్చింది కాబట్టి అమరావతి అనీ, జగన్ ప్రతిపాదించాడు కాబట్టి మావిగన్ అని కాకుండా  అధికార - ప్రతిపక్ష నేతలు సైతం వారి వారి పార్టీల ఎజెండాలను, ఇగోలను పక్కన పెట్టి లోతైన కోణంలో  అందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయం దిశగా అడుగులు వేయాలి. ఈ రకమైన చర్చ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు అత్యావశ్యకం కూడా.

శ్యామ్ కాగిత 
మచిలీపట్నం 

 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...