- 34 పంచాయతీలు, 50 డివిజన్లలో పర్యటనకు శ్రీకారం
- గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు తెలుసుకోవడం లక్ష్యంగా పర్యటన
- సంక్షేమం, అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది
- పోతిరెడ్డిపాలెంలో గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం:
సంక్షేమం, అభివృద్ధిలో మచిలీపట్నం నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పని చేస్తున్నానని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బందరు నియోజకవర్గంలోని 34 గ్రామ పంచాయతీలు, 50 డివిజన్లలో ప్రతి రోజు పర్యటించేలా ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలి రోజు పోతిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని పొట్లపాలెం, పిల్లారిశెట్టిపాలెం, పోతిరెడ్డిపాలెం, శ్రీనివాస నగర్లో పర్యటించారు.
గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. పిల్లలతో మమేకమై వారితో కాసేపు సరదాగా గడిపారు.గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రధానంగా నియోజకవర్గంలో తాగునీరు, రోడ్లు,డ్రైనేజీ సమస్యల గురించి తెలుసుకున్నారు. సెంటు పట్టాలో ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పడంతో అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వ్యవసాయ కాలువల్లో పూడిక తొలగించాలని, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని విన్నవించడంతో అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కరించాలని సూచించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మచిలీపట్నం నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డులో పర్యటించి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేలా ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గత ఐదు సంవత్సరాలు నియోజకవర్గంలో అభివృద్ధిని గాలికి వదిలేశారు. అందుకే క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేలా చిత్తశుద్ధితో పని చేస్తోంది. గ్రామాలను పచ్చగా మార్చడం ద్వారా మాత్రమే అసలైన అభివృద్ధి సాధ్యమవుతుంది. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. డ్రైనేజీలు, రోడ్ల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తాం. డ్రైనేజీ సమస్య లేకుండా చూసుకుంటాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం కేటాయించి ఇళ్లు నిర్మించి అందిస్తాం. ఇంటింటికీ తాగునీటి కుళాయి ఏర్పాటు చేస్తాం.
రాష్ట్రానికి వచ్చే ఆదాయం మొత్తం జీతాలు, పెన్షన్లకే సరిపోతోంది. కేంద్రం నుండి వచ్చే నిధులు వడ్డీలు చెల్లించేందుకు పోతోంది. వృద్ధాప్య పెన్షన్ల కోసం ఏటా రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. తల్లికి వందనం పథకానికి రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఉచిత గ్యాస్ కోసం రూ.2500 కోట్లు ఖర్చు అవుతోంది. ఉచిత బస్సు పథకం, అన్నదాత సుఖీభవ లాంటి అనేక పథకాలు పక్కాగా అమలు చేస్తున్నాం. జగన్ రెడ్డి రూ.3000 పెన్షన్ హామీని ఏటా పెంపు పేరుతో దగా చేస్తే.. కూటమి అధికారంలోకి రాగానే అమలు చేసింది.
గత ఐదు సంవత్సరాలు మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధిని గాలికి వదిలేశారు. కూటమి వచ్చాక చేయాలనుకున్నా అడ్డుకున్నారు. అందుకే భవిష్యత్తులో సమస్య అనేది లేకుండా సన్నాహాలు చేస్తున్నాం. ప్రధాన సమస్యల్ని దశల వారీగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ శాఖ నుండి అవసరమైన నిధులు తీసుకొస్తాం. ప్రధాన రోడ్లు మొత్తం పూర్తి చేశాం. డ్రైనేజీల పనులు పూర్తి చేస్తాం. ఇళ్ల స్థలాలు కూడా అందరికీ అందించి వాటిని పూర్తి చేస్తాం. మచిలీపట్నంలో తాగునీటి సమస్య తీరుస్తాం. సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల్ని వీలైనంత వరకు అభివృద్ధి చేస్తాం. ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ప్రతి గ్రామంలో పర్యటించి ప్రతి సమస్యనూ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాను.
సెంటు పట్టాలో ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బంది ఎదురవుతోందని చెప్పడంతో అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వ్యవసాయ కాలువల్లో పూడిక తొలగించాలని రైతులు కోరడంతో త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కొత్త పెన్షన్ల వినతులను కూడా పరిష్కరించాలన్నారు.
కార్యక్రమంలో గొర్రెపాటి గోపీచంద్ , గోపు సత్యన్నారాయణ , కుంచె దుర్గాప్రసాద్ , గంగాధర్ , మధు , ఆలపాటి రమేష్ , గ్రామ పార్టీ నాయకులు విష్ణు, శివ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment