మచిలీపట్నం :
మనిషి మనుగడకు నీరు ప్రాణాధారం అని, ఆరోగ్యవంతమైన జీవనం కోసం ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన, సురక్షిత తాగునీటిని వినియోగించడం అత్యంత అవసరమని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అన్నారు.
మచిలీపట్నం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్వో తాగునీటి ప్లాంటును ఆయన ప్రారంభించారు. మండుతున్న ఎండల్లో దాహార్తితో అలమటించే ప్రయాణికులకు రోజుకు సుమారు 1000 లీటర్ల సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని కొనియాడారు.
వెలుగు ఫౌండేషన్ అధ్యక్షులు చందమామ బాబు ఆధ్వర్యంలో గత పదేళ్లుగా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించడం సమాజానికి ఆదర్శమని ఆయన అన్నారు. ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు అమెరికాలో నివసిస్తున్న రాడవరపు నాగేశ్వరావు అందించిన సహకారం ఉదారతకు ప్రతీకగా నిలుస్తుందని కొనకళ్ళ అభిప్రాయపడ్డారు. ప్లాంట్ నిర్వహణ కోసం ఐదు సంవత్సరాలపాటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని, సంబంధిత ప్రతినిధులకు ఆయన చేతుల మీదుగా చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు చందమామ బాబు మాట్లాడుతూ, నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి కొరతను దృష్టిలో ఉంచుకుని, అవసరమైన చోట్ల ఇలాంటి ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు కృషి కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి విశేషంగా సహకరించిన కంచనపల్లి కృష్ణమోహన రావు దంపతులను ప్రజా రవాణా శాఖ తరపున కొనకళ్ళ నారాయణరావు ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ టి. పెద్దిరాజు, ఫౌండేషన్ కార్యదర్శి కంచనపల్లి కృష్ణమోహన్ రావు, ఉపాధ్యక్షులు రేపల్లె వసంతరావు, పి. హరి రామకృష్ణ, కే. విజయ్, వేణు కుమార్, జి. రమాదేవి, ఉద్యోగులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment