మచిలీపట్నం :
జిల్లాలో మాతా శిశు మరణాలు సంభవించకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో మాతా శిశు మరణాలపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించి ముగ్గురు తల్లుల మరణాలపై శస్త చికిత్సలు చేసిన డాక్టర్లు, బాధితుల బంధువులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏ తల్లి జన్మనిస్తూ మరణించరాదని, అలాగే ఏ బిడ్డ జన్మిస్తూ మరణించరాదని స్పష్టం చేశారు. ఎలమర్రు గ్రామానికి చెందిన కొల్లూరు స్వరూప రాణికి గుడివాడ ప్రాంతీయ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స ద్వారా ప్రసవం అయ్యాక, ఆమెను అక్కడి డాక్టర్లు విజయవాడ సర్వజన ఆసుపత్రికి తీసుకుపోవాలని సూచించినప్పటికీ 108 అత్యవసర వాహన సిబ్బంది అలా తీసుకొని పోకుండా మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తీసుకురావడం జరిగిందన్నారు. ఆ విధంగా ఎందుకు చేశారని కలెక్టర్ ప్రశ్నించగా 108 అత్యవసర వాహనం ఇన్చార్జి స్టీఫెన్ మాట్లాడుతూ వారి నిబంధనల ప్రకారం దగ్గర ఉన్న మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తీసుకురావడం జరిగిందని వివరించారు.
దీంతో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ సరైన డాక్టర్లు, మందులు, పరికరాలు అందుబాటులో ఉండే ఆసుపత్రికి తీసుకొని వెళ్లే విధంగా రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వానికి ఈ విషయమై సమగ్ర నివేదిక సిద్ధం చేసి పంపాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి సూచించారు.
మిగిలిన రెండు కేసులు ఒకటి పెద్ద అవుటుపల్లికి చెందినది కాగా రెండవది మచిలీపట్నం నగరంలోని బాలాజీ నగర్ కు చెందినదని, ఈ రెండు కేసులు హై రిస్క్ తో కూడినవని పిల్లల్ని కనకూడదు, గర్భం దాల్చకూడదు అని చెప్పినప్పటికీ వారు గర్భం ధరించడం వలన సమస్య ఏర్పడిందని డిఎంహెచ్ఓ కలెక్టర్కు వివరించారు.
దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇందుకోసం మహిళలు, వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ చేసి గర్భం దాల్చకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గర్భిణీ స్త్రీలకు శస్త్ర చికిత్సలు చేశాక ప్రసవానంతరం తల్లి బిడ్డ సురక్షితంగా ఉండాలని, ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలు పాటించాలని కలెక్టర్ హెచ్చరించారు.
ఈ సమావేశంలో డిఎంహెచ్వో డాక్టర్ యుగంధర్, డి ఐ ఓ డాక్టర్ ప్రేమ్ చంద్, జి జి హెచ్ పర్యవేక్షకులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్లు స్వరాజ్యలక్ష్మి, అనురాధ, శ్రీనివాసు, జ్ఞాన కుమారి, స్వచ్ఛంద సభ్యులు సుశీల, ఏఎన్ఎంలు, ఆశా అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment