మచిలీపట్నం:
జిల్లాలోని ప్రతి పాఠశాల విద్యార్థులకు ఉన్నత ప్రమాణాల విద్యతో పాటు మెరుగైన వాతావరణం కల్పించేందుకు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల చేరికలు, ప్రత్యేక విద్యా కార్యక్రమాల అమలుపై జిల్లా కలెక్టర్ గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో విద్యాశాఖ అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆటిజం సెంటర్లు, యోగ సదుపాయాలు, స్మార్ట్ కిచెన్లు, ఎక్సలెన్స్ సెంటర్ల ఏర్పాటు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపట్టిన 'లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్' (లీప్) కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలలను తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు. సమ్మిళిత విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి ఆధారిత బోధన, పరిశోధన-సృజన, ప్రపంచ స్థాయి విద్యాప్రణాళిక అనే ఐదు అంశాల ప్రాతిపదికన ఈ స్కూళ్లను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
అలాగే ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు (ఎన్రోల్మెంట్) పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడి అవగాహన కల్పించాలని సూచించారు. పాఠశాలల అభివృద్ధిలో ఆయా స్కూళ్లలో చదివిన పూర్వ విద్యార్థులను గుర్తించి, వారిని అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం చేయాలని కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సమావేశంలో డీఈవో యు వి సుబ్బారావు, సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్ కుముదిని సింగ్, ఏపీఈడబ్ల్యూఐడిసి ఈఈ రాయన్న, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు డ్వామా పీడీ ఎన్ శివప్రసాద్ యాదవ్, మార్క్ఫెడ్ డిఎం మురళీ కిషోర్, మార్కెటింగ్ శాఖ ఏడి నిత్యానంద్, మెప్మా పీడీ సాయిబాబు, పశుసంవర్ధక శాఖ అధికారి చిననరసింహులు, ఐసిడిఎస్, సాంఘిక సంక్షేమ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Post a Comment