మచిలీపట్నం :
ఉమ్మడి కృష్ణాజిల్లా జాతీయ, రాష్ట్ర రహదారులు, పోర్టు కనెక్టివిటీ రహదారులు, రింగ్ రోడ్డు అభివృద్ధికి బృహత్తర ప్రణాళికలు రూపొందించామని మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలశౌరి తెలిపారు. శుక్రవారం ఉదయం మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని), ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, అవనిగడ్డ, పెడన, పామర్రు, గుడివాడ, పెనమలూరు, విజయవాడ తూర్పు నియోజకవర్గాల శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, కాగిత కృష్ణ ప్రసాద్, వర్ల కుమార్ రాజా, వెనిగండ్ల రాము, బోడె ప్రసాద్, గద్దె రామ్మోహన్ రావుతో కలిసి జాతీయ, రాష్ట్ర రహదారులు, పోర్టు కనెక్టివిటీ రోడ్లు, అమరావతి రింగ్ రోడ్డు అభివృద్ధి, భూ సేకరణ సమస్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీతో పాటు ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు వారి పరిధిలోని 216, 65, 165 జాతీయ రహదారుల అభివృద్ధిలో నెలకొన్న సమస్యలను ప్రస్తావించారు. 4 వరుసలుగా ఉన్న జాతీయ రహదారి 65ను 6 వరుసల రహదారిగా, అదేవిధంగా 2 వరుసలుగా ఉన్న జాతీయ రహదారి 216ను 4 వరుసల రహదారిగా విస్తరించేందుకు రూపొందిస్తున్న వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్)లో పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాలని వారు జాతీయ, రాష్ట్ర రహదారుల అధికారులను కోరారు.
అనంతరం ఎంపీ బాలశౌరి, మంత్రి కొల్లు రవీంద్ర సంయుక్తంగా పాత్రికేయుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రానున్న సంవత్సర కాలంలో మచిలీపట్నం పోర్టు నిర్మాణం పూర్తిచేసి పోర్టు కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు. దీనిలో భాగంగా దాదాపు రూ.450 కోట్ల వ్యయంతో పోర్టు అనుసంధాన రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా దాదాపు రూ.2 వేల కోట్ల వ్యయంతో మచిలీపట్నం విజయవాడ 4 వరుసల జాతీయ రహదారి 65ను 6 వరుసల రహదారిగా విస్తరిస్తున్నామని, అలాగే జనాభా పెరుగుదల, వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు దృష్టిలో పెట్టుకుని రూ.38 వేల కోట్ల వ్యయంతో 189.930 కిలోమీటర్ల అమరావతి రింగ్ రోడ్డు అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. రూ.25 కోట్ల వ్యయంతో గుడివాడ పట్టణంలో జాతీయ రహదారుల అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు.
350 కిలోమీటర్ల కత్తిపూడి–ఒంగోలు 2 వరుసల 216 జాతీయ రహదారిని 4 వరుసల రహదారిగా విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని చెబుతూ, లోసరి వంతెన నుంచి తాళ్లపాలెం, గిలకలదిండి, ఉల్లిపాలెం, వాడపాలెం, కోడూరు మీదుగా తీరం వెంబడి అనుసంధానం చేసి అభివృద్ధి చేసేందుకు మంత్రి కొల్లు రవీంద్ర సూచన చేశారని, దీనివల్ల పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, దీనిపై కేంద్రమంత్రి నితిన్ గట్కరితో చర్చించి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అదేవిధంగా పీఎం గతిశక్తి పథకం ద్వారా పామర్రు, చల్లపల్లి ప్రాంతాలను జాతీయ రహదారులతో అనుసంధానానికి సంబంధిత అధికారులతో ప్రతిపాదించినట్లు తెలిపారు. మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా విద్యుత్ దీపాల ఏర్పాటు, పెనమలూరు వద్ద డ్రైనేజీ సమస్యలు, అవసరమైన చోట్ల అప్రోచ్ రహదారులు, అండర్ పాస్ ల ఏర్పాటు చేసే విధంగా డి పి ఆర్ లో రూపొందించాలని అధికారులకు సూచించామన్నారు. కంకిపాడు నుండి గుడివాడ వరకు గ్రీన్ ఫీల్డ్ రహదారి ప్రతిపాదించామని దీనిని రింగ్ రోడ్డుతో అనుసంధానానికి సూచించామన్నారు.
అమరావతి రింగ్ రోడ్డుకు సమాంతరంగా నియోజకవర్గాల రహదారుల అభివృద్ధి: మంత్రి కొల్లు రవీంద్ర
మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ దాదాపు 189 కిలోమీటర్ల అమరావతి రింగ్ రోడ్డు కృష్ణాజిల్లాలో ఉయ్యూరులోని వల్లూరి మీదగా వెళ్లే రహదారికి సమాంతరంగా మచిలీపట్నం, పామర్రు, గుడివాడ ప్రాంతాల రహదారులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. 216 జాతీయ రహదారి విస్తరణలో భాగంగా మచిలీపట్నం పోర్టుకు అనుసంధానంతో పాటు తీర ప్రాంతాలకు మేలు జరిగే విధంగా విస్తరణకు ప్రతిపాదించామన్నారు. దీనివల్ల పర్యాటక ప్రాంతం మంగినపూడి బీచ్ అభివృద్ధితోపాటు పోర్టు అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. లోసరి వంతెన దగ్గర నుంచి కోడూరులోని ఉల్లిపాలెం వంతెన వరకు దాదాపు 70 కిలోమీటర్ల మేర ఉన్న తీరప్రాంతాన్ని కలుపుకుంటూ 216 జాతీయ రహదారి విస్తరణకు ప్రతిపాదించామని, దీనివల్ల తీర ప్రాంతంలో కరకట్టగా కూడా ఉపయోగపడుతుందని, రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి కృషి చేయాలని మచిలీపట్నం ఎంపీని కోరినట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా 216 జాతీయ రహదారితో పోర్టు కనెక్టివిటీకి మొదటగా లీఫ్ ఫ్లైఓవర్ నమూనాను ప్రతిపాదించారని అయితే రైతుల కోరిక మేరకు దానిని మార్పు చేసినట్లు తెలుపుతూ దీనివల్ల భూ సేకరణ తగ్గుతుందని అన్నారు. మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిని మూడు స్తంభాల సెంటర్ వరకు విస్తరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా ఎంపీ బాలశౌరి కృషి వల్ల చిలకలపూడి, బందరుకోట, కరగ్రహారం, పోతేపల్లి ప్రాంతాల వద్ద నాలుగు రైలు ఓవర్ బ్రిడ్జిలు (ఆర్ఓబి) మంజూరయ్యాయని, ప్రస్తుతం అవి టెండర్ల దశలో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ సాస్కీ కింద మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గానికి దాదాపు రూ.100 కోట్లు నిధులు కేటాయించి జిల్లా అభివృద్ధికి సహకారాన్ని అందిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు.
తొలుత సమీక్షా సమావేశంలో విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారి విస్తరణలో పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. ముఖ్యంగా లక్షకు పైగా జనాభా ఉన్న కృష్ణలంక ప్రాంతంలో తరచుగా రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయని, అక్కడ తగిన విధంగా మార్పులు చేయాలని, అదేవిధంగా పెనమలూరు నుండి బెంజ్ సర్కిల్ మీదగా న్యూ బస్ స్టేషన్ వరకు ఫ్లైఓవర్ కు ప్రతిపాదించారు. జాతీయ రహదారులు 16, 65 అనుసంధానం చేసే విధంగా డిపిఆర్ లో పొందుపరచాలని కోరారు.
సమావేశంలో జాతీయ రహదారుల ఆర్వో ఆర్ కే సింగ్, పీడీ విద్యాసాగర్, రాష్ట్ర రహదారులు ఆర్వో హరికృష్ణ, పీడీ సాయి శ్రీనివాస్, అమరావతి రింగ్ రోడ్ పిడి పార్వతీశం, ఆర్ అండ్ బి ఎస్ఈ శంకర్ రెడ్డి, ఈఈ శ్రీనివాస్, డిఆర్ఓ కె చంద్రశేఖరరావు, బందరు, గుడివాడ, ఉయ్యూరు ఆర్డీవోలు కే స్వాతి, జి బాలసుబ్రమణ్యం, బిఎస్ హేలా షారోన్, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్ బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment