మచిలీపట్నం
కూటమి ప్రభుత్వం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు
శనివారం సాయంత్రం మంత్రివర్యులు నగరంలోని వారి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్---ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వారి అభ్యర్థనలను ఎంతో ఓపికగా ఆలకించి సానుకూలంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తొలుత మంత్రివర్యులు ఎస్సీ సంఘాల నాయకులతో కలిసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
మచిలీపట్నం నగరం 36వ డివిజన్ రాజుపేట కు చెందిన షేక్ మస్తానీ అర్జీ అందజేస్తూ తన కుమార్తె షేక్ ఆషాకు 90% వికలత్వం కలదని, ప్రస్తుతం నెలకు 6 వేల రూపాయలు పింఛను ప్రభుత్వం ఇస్తుందని, వైద్య ఖర్చులు కుటుంబ అవసరాల కోసం ఆ మొత్తం సరిపోవుట లేదని 15 వేల రూపాయలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.
మచిలీపట్నం నగరం 32వ డివిజన్ ఎస్సీ కాలనీకి చెందిన ఎస్ నవీన్ కుమార్ అర్జీ అందజేస్తూ చనిపోయిన షెడ్యూల్ కులాలకు చెందిన వారిని దహనం చేయడానికి స్మశానం లేక కాలువ గట్టు మీదే దహనం చేస్తున్నామని పక్కన ఉన్న స్మశానంలో కొంత స్థలం కేటాయించాలనీ విజ్ఞప్తి చేశారు.
మచిలీపట్నం నగరం 26వ వార్డుకు చెందిన గార్లపాటి లక్ష్మీ సుగుణ అర్జీ అందజేస్తూ తనకు 55 సంవత్సరాలని తన భర్త ఆరోగ్యం బాగాలేదని ఏ పని చేయుటకు వీలులేదని ఇంటి అద్దె చెల్లించలేకపోతున్నామని తమకు టిడ్కో జి ప్లస్ 3 ఇళ్లను కేటాయించాలని కోరారు.
మచిలీపట్నం నగరం 48వ డివిజన్ నిజాంపేటకు చెందిన మేరుగు సాయినిర్మల అర్జీ అందజేస్తూ తాను కొన్ని సంవత్సరాలుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని గుంటూరు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య పరీక్షలు చేయగా గుండెలో నాలుగు రంద్రాలు ఉన్నాయని గుర్తించారని ఒక దానికి ఆపరేషన్ చేశారని మిగిలినవి చేయాలంటే ప్రాణానికి ముప్పని చెప్పారు అంటూ తన తల్లిదండ్రులు కూడా కాలం చేశారని తన బాగోగులు అన్ని వారి పిన్ని చూస్తున్నారని జీవనోపాధికి కూడా కష్టంగా ఉందని తనకు జీవనాధారానికి ఆసుపత్రి ఖర్చులకు ఒంటరి మహిళ కింద పింఛను మంజూరు చేయాలని కోరారు.
మచిలీపట్నం నగరం 50 వార్డుకు చెందిన సిరిగిరి మణి అర్జీ అందజేస్తూ తన భర్త సుబ్బారావు మరణించారని తనకు ఏ విధమైన ఆధారము లేదని జీవనం గడుపుటకు చాలా ఇబ్బందిగా ఉందని పింఛను మంజూరు చేయాలని కోరారు.
మచిలీపట్నం నగరం 28వ డివిజన్ కు చెందిన మహమ్మద్ ఆరిఫ్ అర్జీ అందజేస్తూ ఇందుకూరుపేట ప్రాంతంలో వీధి కుక్కలు ఎక్కువగా ఉన్నాయని, ప్రజలను ముఖ్యంగా పిల్లలను వెంటాడుతూ చాలా ఇబ్బందులు పెడుతున్నాయని మున్సిపల్ కమిషనర్కు చెప్పినా పట్టించుకోవటం లేదని ఫిర్యాదు చేశారు.
45 వ డివిజన్ ఇన్చార్జి రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఫణి కుమార్ ఆధ్వర్యంలో జిల్లా పశుసంవర్తక శాఖ అధికారి చిన్న నరసింహులు ఏడీలు నరసింహస్వామి రాధాకృష్ణ మంత్రివర్యులను కలిసి విజ్ఞాపన పత్రం అందజేస్తూ తమకు ఒక పశువుల హాస్టల్ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని స్థలం కేటాయించాలని కోరగా మంత్రివర్యులు వెంటనే స్పందిస్తూ మంగినపూడిలో 10 ఎకరాల స్థలం గుర్తించామని అందులో 5 ఎకరాలు స్థలం తీసుకోవాలని సూచించారు.
రైతు బజార్ దగ్గర ఉన్న తమ కార్యాలయం శిథిలావస్థలో ఉందని రామోజీ ట్రస్ట్ నుండి రైతు శిక్షణ కేంద్రం తదితర భవనాలను నిర్మించుటకు సంప్రదించామని మంత్రివర్యులు కూడా వారి సహకారం అందించాలని కోరారు. వారి కార్యాలయ ప్రవేశ మార్గంలో కల్వర్టు దెబ్బతినిందని దాన్ని విస్తరించి పటిష్టం చేయాలని మున్సిపల్ కమిషనర్ కు తెలియజేసినట్లు వివరించారు.
పశువుల ఆసుపత్రికి తాగునీటి సౌకర్యం కల్పించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. మంత్రి వెంటనే స్పందిస్తూ వారికి అన్ని వసతులు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నగర కార్పొరేటర్ అనిత, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచే నాని, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, స్థానిక నాయకులు వెంకటస్వామి, ఇలియాస్ భాష పలువురు అర్జీదారులు పాల్గొన్నారు.
Comments
Post a Comment