మచిలీపట్నం:
జిల్లాలోని పట్టణ ప్రాంతాలలో అనధికార లేఅవుట్లను, ఆక్రమణలను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో మునిసిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించి వ్యర్థ పదార్ధాల తొలగింపు, ఇంటింటి చెత్త సేకరణ, ఇంటిలోనే కంపోస్ట్ తయారీ, పెరటి తోటల పెంపకం, ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ నిషేధం అమలు, చెత్తను వేరుపరచుట, నీటి సరఫరా, పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణం తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో అనధికార ఆక్రమణలను లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పిస్తూ మార్చి వరకు గడువు ఇచ్చిందన్నారు. క్రమబద్దీకరణ కోసం దరఖాస్తులు చాలా తక్కువగా రావడంతో జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెంటనే ఆక్రమణదారుల జాబితా పరిశీలించి అందరికి నోటీసులు జారీ చేయాలన్నారు. ఎవరైనా స్పందించకపోతే జెసిబి లతో నిర్దాక్షిణ్యంగా తొలగించేందుకు సిద్ధం కావాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు
మచిలీపట్నం డంపింగ్ యార్డ్ లోని పాత వ్యర్థాలను పూర్తిస్థాయిలో తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. చెత్త నుండి కాంపోస్టు తయారు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మచిలీపట్నంలోని నారాయణపురం, గుడివాడలోని ధనియాల పేట బేతవోలు లో త్వరితగతిన పట్టణ ఆరోగ్య కేంద్రాలను నిర్మాణం పూర్తి చేయాలన్నారు. తాడిగడపలో మంజూరైన కానూరు ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి సత్వరమే స్థలం గుర్తించాలన్నారు
పెడనలో 3 సివేజి ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఉయ్యూరులో 2 ట్రీట్మెంట్ ప్లాంట్లకు అవసరమైన స్థలాలను వెంటనే గుర్తించాలన్నారు
ఈ సమావేశంలో మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, సహాయ కమిషనర్ గోపాల్ రావు, గుడివాడ ఉయ్యూరు తాడిగడప పెడన మున్సిపల్ కమిషనర్లు మనోహర్, రామారావు, నజీర్, రామాంజనేయులు జిల్లా ప్రజారోగ్య ఇంజనీరింగ్ అధికారి ప్రవీణ్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Comments
Post a Comment