Skip to main content

బలమైన కుటుంబ వ్యవస్థ ద్వారానే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యం –– జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టాల గోపి

పెడన: 

ఆరోగ్యకరమైన కుటుంబ సంబంధాలు సామాజిక స్థిరత్వానికి మూలం, నేరాలు, సామాజిక వ్యతిరేక ప్రవర్తనలను తగ్గిస్తాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గుట్టాల గోపి పేర్కొన్నారు.

శనివారం ఉదయం పెడన మండలంలోని పెడన ఫంక్షన్ హాల్లో జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా పరిపాలనా యంత్రాంగం సంయుక్తంగా నూతన తరహా న్యాయ సేవల శిబిరం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కేవీ రామకృష్ణయ్య, మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పోతురాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డిఎల్ఎస్ఏ), ప్రభుత్వానికి న్యాయవ్యవస్థలకు మధ్య వారధిగా ఉండి పని చేస్తుందన్నారు. డిఎల్ఎస్ఏ, రాజీ మార్గం ద్వారా కక్షిదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం అందిస్తుందన్నారు. సామాన్యులకు న్యాయం అందుబాటులో ఉంచడం, సాంఘిక దురాచారాల పోరాటంపై ప్రజలకు అవగాహన కల్పించడం, పిల్లల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా దూరమైన వారిని గుర్తించి వారికి చేరువ చేసేలా చర్యలు తీసుకోవడంపై డిఎల్ఎస్ఎ విశేష కృషి చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కల్పించుకుని అవసరం మేరకు మాత్రమే వాటిని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.

ప్రపంచంలో అత్యధిక యువత జనాభా కలిగిన దేశం భారత్ అని, కానీ గంజాయి వంటి మత్తుపదార్థాలకు బానిసై జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలు సరైన మార్గంలో పయనించాలంటే ముందు తల్లిదండ్రుల ఆలోచనలు, ప్రవర్తన ఆదర్శంగా ఉండాలన్నారు.
స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ సమాజంలో ఇప్పటికీ బాల్యవివాహాలు జరగటం విచారకరమన్నారు. వివాహానికి సరైన వయసు లేకపోవడం వల్ల తల్లితోపాటు పుట్టబోయే సంతానికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అదేవిధంగా ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిస్సహాయ స్థితిలో ఉండి న్యాయ సహాయం అవసరమైన వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సేవలు అందించడం అభినందనీయమని, దీనిపై అవగాహన కలిగి డిఎల్ఎస్ఎ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమాజంలోని యువత మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను దుర్భలం చేసుకోవద్దని కోరారు. పిల్లలను తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర ఎంతో కీలకమని చెబుతూ, వారి మానసిక ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు.

డిఆర్ఓ మాట్లాడుతూ కుటుంబంలో పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెబుతూ, వారితో ప్రేమగా, స్నేహంగా మెలగాల్సిన అవసరం ఉందని, తద్వారా చెడు వ్యసనాలకు బానిసలుగా మారే అవకాశాలు తగ్గుతాయన్నారు.

కార్యక్రమంలో, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పథకాలు పిల్లలకు అనుకూలమైన చట్టపరమైన సేవలు (చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్)పై అదనపు సీనియర్ సివిల్ జడ్జి సిహెచ్ యుగంధర్, అదేవిధంగా మాదకద్రవ్యాల అవగాహన వెల్నెస్ నావిగేషన్ పై ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ పి సాయిసుధా వివరించారు. 

దివ్యాంగులకు ఉపయోగపడే వినికిడి పరికరాలు, ముగ్గురు లబ్ధిదారులకు బ్యాటరీ ట్రైసైకిళ్లు అందజేశారు. 14 మంది ఎస్టీ లబ్ధిదారులకు గొర్రెల పెంపకం కోసం రూ.6.30 లక్షల చెక్కును అందించారు. అదేవిధంగా 20,670 మంది డ్వాక్రా సంఘాల సభ్యులకు స్త్రీ నిధి నుంచి రూ.143.94 కోట్ల జీవనోపాదుల రుణాల చెక్కును, 9,458 స్వయం సహాయక సంఘాలకు రూ.726.43 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును లబ్ధిదారులకు అందించారు.

కార్యక్రమంలో వివిధ పాఠశాలల చిన్నారుల సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు, అదేవిధంగా సమాజంలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరిస్తూ కళాకారులు లఘు నాటిక ప్రదర్శన, జానపద గీతాలతో చైతన్యం కలిగించారు.

ఆకట్టుకున్న స్టాళ్లు..
ఈ కార్యక్రమం సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా ఎస్పీ, డీఆర్వో కే చంద్రశేఖరరావు, ఇతర న్యాయమూర్తులతో కలిసి సందర్శించి తిలకించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత న్యాయ సేవలు, కృష్ణా జిల్లా పోలీస్ విభాగం వారి మహిళలు చిన్నారులపై నేరాల నియంత్రణకై అవగాహన ప్రదర్శన, అదేవిధంగా సైబర్ నేరాల డిజిటల్ అరెస్ట్ పై అవగాహన, ఏపీఎస్ఆర్టీసీ ప్రజలకు అందిస్తున్న సేవలు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థల (సెర్ప్) ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన కలంకారి హ్యాండ్లూమ్స్, ఇతర ఉత్పత్తులు, మైనారిటీ విద్యార్ధులు, ముస్లిం కమ్యూనిటీల కోసం ప్రభుత్వం అందిస్తున్న సేవలను వివరిస్తూ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ స్టాల్, ఉచిత వైద్య శిబిరం, మలేరియా డెంగ్యూ నివారణ సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖలు అందిస్తున్న పథకాలు, సంక్షేమ వసతి గృహాలు, విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ వివిధ ఉపకరణలు, అగ్నిమాపక సేవల శాఖ వారి అవగాహన ప్రదర్శన, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమం వారి అంగన్వాడి ప్రీ స్కూల్ ప్రదర్శన, అదేవిధంగా బాల్యవివాహాల నిషేధంపై చిన్నారుల వేషధారణను అతిధులు ఆసక్తిగా తిలకించారు.

కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడి కామరాజు, బీసీ కార్పొరేషన్ ఈడి రాజేంద్ర ప్రసాద్, సాంఘిక, వెనుకబడిన తరగతులు, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు, డ్వాక్రా సంఘాల మహిళలు, అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...