మచిలీపట్నం :
స్థానిక మహతి కళావేదిక లో భావతరంగిణి సంస్థ ఆధ్వర్యంలో భవిష్య రచించిన అభినయ సాంఘిక నాటక పుస్తకావిష్కరణ ఆదివారం సాయంత్రం జరిగింది.
ప్రపంచ తెలుగు రచయితల సంఘ అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు, సాహిత్య వేత్త డాక్టర్ ధన్వంతరి ఆచార్య, ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, భావ తరంగిణి గౌరవాధ్యక్షులు కె. కృష్ణమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఆవిష్కరణ అనంతరం ప్రేక్షకులే సమీక్షకులు అని రచయిత ప్రకటించి వెంటనే అభినయ నాటక ప్రదర్శన నిర్వహించడం వినూత్నమైన ఆలోచన. ప్రముఖ సాహితీవేత్త కొప్పరపు నారాయణ మూర్తి, చార్టర్డ్ అకౌంటెంట్ బి.వి.వి.సత్యనారాయణ, రచయిత్రి గుడిపూడి రాధికారాణి, తెలుగు భాషా సమాఖ్య కార్యదర్శి అప్పినేడి పోతురాజు, ఆర్టీసీ డి.ఎం.పెద్దిరాజు, ప్రముఖ గాయని కాళీపట్నపు ఉమ, కవయిత్రి మాదిరాజు శివలక్ష్మి తదితరులు అభినయను వీక్షించి సమీక్షించారు. సాహితీ ప్రియులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అద్భుతం అభినయ నాటకం
స్థానిక మహతి కళావేదికలో ఆదివారం సాయంత్రం ప్రదర్శించిన అభినయ సాంఘిక నాటకం పలు ప్రత్యేకతలతో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది.
భావ తరంగిణి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నాటక రచయిత భవిష్య దర్శక నిర్వాహణలో ప్రదర్శించిన అభినయ నాటకం అధ్యంతం ఆసక్తికరంగా సాగింది. నాటకం మొదటి నుంచి చివరి వరకు మన కళా రంగం విశిష్టత ప్రాధాన్యత అవసరం అలాగే మన విలువైన సాహితీ సంపదను పరిరక్షించుకోవాలి అనే కథాంశంతో జరిగింది. కళాకారులకు ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించేలా నాటకం ఉందని పలువురు తమ భావాన్ని వ్యక్తం చేశారు
అలాగే నాటకంలో మొదట పల్లె వాతావరణం ఒక వృద్ధురాలు పాటని ఏ ఐ ద్వారా పాడిచ్చి ప్రదర్శించారు.
"పల్లె అందాలన్నీ పోయే నగరాల నాగరికత వచ్చే రోళ్ళు పోయే రోకళ్ళు పోయే కోడళ్ళ కాళ్ళకేమో కీళ్ల నిప్పులాయే... "జానపద తరహాలోని ఈ పాటను ఏఐ ద్వారా పాడించి అక్కడ ప్రదర్శనలో అభినయించారు .
మొత్తం నాటకంలో పాటలు కూచిపూడి నాట్యము వయోలిన్ వాయిద్యం అన్ని ఉండటంతో నవరసభరితంగా సాగింది. మరో విశేషమేమంటే నాటకంలో పి .శాంతి 80 ఏళ్ల నాయినమ్మ గా 50 ఏళ్ల తల్లి గా 20 ఏళ్ల హీరోయిన్ గా త్రిపాత్రాభినయం చేయటం హైలైట్ గా ఉంది. మరో పాత్రధారి రావినూతల సత్యనారాయణ పద్మనాభరావు పాత్రధారిగా, పాత్రికేయుడుగా, పాల అబ్బాయిగా మూడు పాత్రలను చక్కగా పోషించారు.
ఇంకా నాటకంలో దండిభోట్ల దత్తాత్రేయ శర్మ ప్రముఖ నాట్యాచార్యులు పాత్రధారిగా, యల్లాప్రగడ శ్రీరామ్ సినీ డైరెక్టర్ గా, ఆర్ వెంకటేశ్వరరావు హాస్య పాత్రధారిగా, ప్రముఖ వైద్యులు డాక్టర్ ధన్వంతరి డాక్టరు పాత్ర మరియు సాహితీవేత్త పాత్రధారిగా, అద్దేపల్లి సత్య మల్లికార్జున ప్రసాద్ హీరోగా, కోసూరు ఈశ్వరరావు కవి పాత్రధారిగా, వై హరిణి కూచిపూడి నాట్య కళాకారునిగా, జె.కృష్ణ కౌండిన్య దత్ బాల నటుడుగా తమ తమ పాత్రలకు న్యాయం చేకూర్చి నాటకాన్ని విజయవంతం చేశారు.
Comments
Post a Comment