మచిలీపట్నం
ప్రజల నుండి అందే మీకోసం అర్జీల పట్ల సానుకూలంగా స్పందించి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీకోసం--ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
ప్రజల సమస్యలను ఎంతో ఓపికగా ఆలకించి సంబంధిత అధికారులను పిలిపించి వారి దరఖాస్తులను వెంటనే విచారించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కలెక్టరేట్లో జిల్లా యంత్రాంగం 201 అర్జీలు స్వీకరించింది. అందులో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి:
మచిలీపట్నం ఈడేపల్లిలో నివాసం ఉంటున్న తాడికొండ లక్ష్మీ భవాని తాను 2018, 2019 సంవత్సరాల్లో 50 వేల రూపాయలు ఎన్టీఆర్ నగర్ ఇంటి మంజూరు కోసం జమ చేయడం జరిగిందని, బ్లాక్ నెంబర్ సి 22 రెండవ అంతస్తు ప్లాట్ నెంబర్ గా మంజూరు పత్రం ఇచ్చి ఉన్నారనీ,
కొన్ని రోజుల తర్వాత సచివాలయం వారు వచ్చి తనకు ఇల్లు కాకుండా స్థలం మంజూరైనట్లు పత్రం ఇచ్చినారని తాను వెంటనే స్థలం వద్దని ఇల్లు మంజూరు కొరకు స్థలం మంజూరు పత్రం పై ఇల్లు మంజూరు కొరకు రాసి తిరిగి సచివాలయం వారికి ఇచ్చేశానని అప్పటినుండి ఇప్పటివరకు తనకు ఇల్లు మంజూరు పత్రం ఇవ్వలేదని తనకు టిడ్కో పథకం ద్వారా ఇల్లు మంజూరు చేయవలసిందిగా కోరుతూ అర్జీ అందజేశారు.
మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని 34వ డివిజన్లో నూరి నగర్ లో చెందిన షేక్ మహమ్మద్, ఆసిఫా, అయిషా సిద్దిక్, షబానా తబస్సుమ్ మరికొందరు కలిసి అర్జీ అందజేస్తూ తమ ప్రాంతంలో మసీదు వెనకాల షేక్ సాదిక్ సోదరులకు చెందిన స్థలం చుట్టుపక్కల సుమారు 50 ఇళ్లు ఉన్నాయని, ఆ స్థలంలో వర్షపు నీరు చేరి విషపూరితమైన సర్పాలు సంచరించుతూ ప్రజలను భయభ్రాంతులను గురిచేస్తున్నాయని, ఆ నీటిని తొలగించాలని దోమలు విపరీతంగా పెరిగి విష జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఉందని, ఆ వ్యాధులు ప్రబలకుండా కాపాడాలని అధికారులకు చెప్పిన పట్టించుకోవడంలేదని ఫిర్యాదు చేశారు.
బంటుమిల్లి మండలం జయపురం గ్రామానికి చెందిన సబ్బిశెట్టి పద్మావతి తన కుమారుడు వెంకట మదన్ కుమార్ తో కలిసి అర్జీ అందజేస్తూ తాము 1999లో గ్రామంలోని సర్వేనెంబర్ 68/1బి లో రోడ్డు పక్కన ఉన్న 2 ఎకరాల 8 సెంట్లు చెరువును కొనుగోలు చేశామని దానికి 2002లో రెవెన్యూ వారు పాస్బుక్ ఇచ్చారని, రోడ్డు చుట్టూ తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని, ఆక్రమణలు తొలగించాలని కోరుతూ 2023లో అర్జీ ఇచ్చామని దానినీ పరిష్కరించాలని కోరుతూ పలుమార్లు తిరిగినప్పటికీ ఇంకా పరిష్కారం కాలేదని ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ ఈ విషయమై పరిశీలన జరిపాక తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మచిలీపట్నం ఆర్టీసీ కాలనీ మూడవ రోడ్డు మురళికృష్ణ హాస్పిటల్ ఎదురుగా రహదారి గానీ డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో మురుగుగుంటలు ఏర్పడి ఆ దారిలో పాఠశాలలకు వెళ్లే పిల్లలతో సహా అందరము వెళ్లడానికి చాలా ఇబ్బందులు గురవుతున్నామని, సిమెంటు రహదారి నిర్మించాలని కోరుతూ మహమ్మద్ హసీనా, సిహెచ్ కోటేశ్వరి, చందన నాగేశ్వరరావు తదితరులు విజ్ఞప్తి చేస్తూ అర్జీ అందజేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను అభ్యర్థనలను అన్ని విధాల విచారించి సానుకూలంగా సకాలంలో పరిష్కరించాలన్నారు.
జిల్లాలో ఇంకను 284 అర్జీలను సంబంధిత జిల్లా అధికారులు ఇంకను చూడకపోవడం సరైనది కాదని స్పష్టం చేస్తూ ఇకనైనా వెంటనే చూసి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇంకను 128 అర్జీలు గడువు దాటి ఉన్నాయని వాటిని అత్యంత ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలన్నారు.
పరిష్కరించిన అర్జీలను ఆడిట్ కూడా చేయాలన్నారు.
జిల్లా అధికారులు వారి పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ భారతీయ స్టేట్ బ్యాంకులో జీతాలకు సంబంధించిన ఖాతా ఉంచుకునేలా ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. తద్వారా వారు మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారన్నారు.
ఆర్టిజిఎస్ కు సంబంధించి మండలాలతో కలుపుకొని ప్రగతి చూస్తున్నందున క్షేత్రస్థాయిలో కూడా అధికారులందరూ వారికి సంబంధించిన ఉత్తర్వులు వివిధ రకాల పత్రాలను ఆర్టిజిఎస్ లో అప్లోడ్ చేయాలన్నారు.
వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన విజయ గాధలను గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధిపతికి అందజేయాలన్నారు.
జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి చెందిన చాలా కోర్టు కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.
ఉద్యోగుల సమస్యలను కూడా వచ్చే ఉద్యోగుల గ్రీవెన్స్ రోజు లోగా పరిష్కరించాలన్నారు.
ఈసారి నూతన సంవత్సరం వేడుకలు పుష్పగుచ్చాలు, శాలువలు, మిఠాయిలతో కాకుండా జిల్లాలోని అన్ని ప్రభుత్వ బాలికల వసతి గృహాల్లో వారికి సానిటరీ ఇన్సినేటర్స్ కొనుగోలుకు, కింద కూర్చునీ చదువుకునే విద్యార్థులకు చలికాలంలో ఇబ్బంది లేకుండా చాపలు, చదువుకునేందుకు ప్లాంకులు ( ఉపకరణాలు) అందించే విధంగా జిల్లా అధికారులు వారి సిబ్బంది ముందుకు రావాలన్నారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఏ డ్వామా పిడీలు హరిహరనాద్, శివప్రసాద్, డీఎస్ఓ మోహన్ బాబు, పౌరసరఫరాల సంస్థ డిఎం శివరామ్ ప్రసాద్, డిఎం అండ్ హెచ్ ఓ డా. యుగంధర్, డిపిఓ డా.జె. అరుణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సోమశేఖర్, ఆర్ అండ్ బి ఈ లోకేష్, ఐ సి డి ఎస్ పిడి ఎంఎన్ రాణి, సర్వే భూ రికార్డుల ఏ డి జోషిలా, మార్క్ఫెడ్ డి ఎం మురళీకృష్ణ, మార్కెటింగ్ ఎడి నిత్యానందం తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు
Comments
Post a Comment