శ్యామ్ కాగిత, మచిలీపట్నం:
పింఛనుదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమయానికి పింఛన్లు అందిస్తున్నామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
సోమవారం ఉదయం మంత్రి, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) ఛైర్మన్ బండి రామకృష్ణ తదితర నాయకులతో కలిసి నగరంలోని 16వ డివిజన్లో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. డయాలసిస్ పేషంట్ కి రూ. 10 వేలు, అదేవిధంగా పక్షవాతం బాధితుడు కు ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 15 వేల పింఛను అందించారు. మంత్రి లబ్ధిదారులతో ముచ్చటించి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు డివిజన్లోని ఐదు రోడ్ల సెంటర్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అర్హులైన ఇరువురు లబ్ధిదారులకు సొంత స్థలంలో ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వ ఆర్థిక సహాయం మంజూరు పత్రాలను అందించారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 64 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెలా 2,730 కోట్లతో సంవత్సరానికి దాదాపు రూ. 35 వేల కోట్లను పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోందని తెలుపుతూ, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వనంతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద మొత్తంలో పింఛన్లు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
కృష్ణాజిల్లాలో 2.30 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెల పింఛన్లు అందిస్తున్నామని, బందరు పట్టణంలో దాదాపు 18 వేల పింఛన్లు, బందరు మండలంలో 12వేల పింఛన్లు తెల్లవారుజామున మొదలుపెట్టి మధ్యాహ్నానికి నూరు శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేస్తున్నామన్నారు.
దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి రూ. 15 వేలు, డయాలసిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10 వేలు, వితంతువులు, వృద్ధులకు రూ. 4 వేలు, దివ్యాంగులకు రూ. 6 వేలు చొప్పున పేదలకు పింఛన్లు అందజేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఆదాయ వనరులను పెంచుకొని సమయానికి పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు.
పర్యటనలో భాగంగా మంత్రి ఐదు రోడ్ల సెంటర్లో తేనీటిని సేవించి టీ కొట్టు యజమానితో ముచ్చటించి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో నాటి రోజులను గుర్తు చేసుకుంటూ డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ టీ షాపులో స్వయంగా కాఫీని తయారు చేసి వినియోగదారులకు అందించారు. సహాయంగా మంత్రి, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కాఫీ తయారీ ముడి పదార్థాలను డీసీఎంఎస్ ఛైర్మన్ కు అందించారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ జెడ్పిటిసి లంకే నారాయణ ప్రసాద్, నగర మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, సహాయ మున్సిపల్ కమిషనర్ గోపాలరావు, 16వ డివిజన్ కార్పొరేటర్ దింటకుర్తి సుధాకర్, న్యాయవాది సోడిశెట్టి బాలాజీ, లోగిశెట్టి స్వామి, బచ్చు అనీల్ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.
Comments
Post a Comment