మచిలీపట్నం, విశాఖలో తీర ప్రాంత అభివృద్ధికి మైరా బే వ్యూ రిసార్ట్స్ తో ఒప్పందం కుదిరినట్లు
పర్యాటక శాఖ వెల్లడించింది.
ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా ప్రభుత్వానికి ప్రత్యక్ష, పరోక్ష పన్ను ఆదాయం, ప్రాంతీయ ఆర్థిక ప్రయోజనాలతో పాటు తీర ప్రాంత అభివృద్ధికి బీజం పడనుందని తద్వారా 880 మందికి ప్రత్యక్ష, 1100 మందికి పరోక్ష ఉపాధి కలగనుందని పర్యాటక శాఖ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన నూతన పర్యాటక, భూ కేటాయింపుల పాలసీకి అనుగుణంగా రాష్ట్రంలోని మచిలీపట్నం, విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు మైరా బే వ్యూ రిసార్ట్స్ ముందుకు వచ్చింది.
రూ.255.91 కోట్ల అంచనా వ్యయంతో విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం కొత్తవలసలో 'మైరా బే వ్యూ రిసార్ట్స్ మరియు 3000 మంది సామర్థ్యం గల కన్వెన్షన్ సెంటర్ ను 15 ఎకరాల్లో నెలకొల్పేందుకు నిర్ణయించింది. ఇది పూర్తయితే భీమిలి నుండి భోగాపురం వరకు ఉన్న పర్యాటక కారిడార్ లో ఒక సమగ్ర హై ఎండ్ పర్యాటక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు గా నిలవనుంది. అంతేగాక లగ్జరీ విల్లా తరహా కాటేజీలు, టవర్ హోటల్ బ్లాక్ తో సహా 196 గదులను నిర్మించనుంది. అదే విధంగా ప్రీ -ఫంక్షన్ ప్రదేశాలు, బిజినెస్ మీటింగ్ రూమ్ లు, ఎగ్జిబిషన్ జోన్ లను ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయనుంది. 600 మంది సామర్థ్యం గల బ్యాంకెట్ హాల్, 200 మంది సామర్థ్యం గల రెండు బహుళార్ధసాధక బాల్రూమ్లతో పాటు రూఫ్టాప్ ఇన్ఫినిటీ పూల్, స్పాలు, వెల్ నెస్ థెరఫీ జోన్ లు, ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ (400+ మందికి), 20,000 చ.అ.ల రిటైల్/షాపింగ్ ప్రాంతం ఏర్పాటు చేయనుంది. తద్వారా 500 మందికి ప్రత్యక్షంగా మరో 500 మందికి పరోక్షంగా ఉపాధి కలగనుంది.ఈ ప్రాజెక్ట్ ద్వారా 99 సంవత్సరాలకు రాష్ట్ర ప్రభుత్వానికి లీజు ద్వారా వచ్చే ఆదాయం అంచనా రూ. 130.78 కోట్లు. 99 సంవత్సరాలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వాటా (revenue share) అంచనా రూ. 216.63 కోట్లు. ప్రస్తుతం ఉన్న భూమి విలువ ఎకరానికి రూ.3 .63 కోట్ల చొప్పున 15 ఎకరాలకు రూ.54.45 కోట్లు విలువ చేస్తుంది.
దీనితో పాటు రూ.157.53 కోట్ల అంచనా వ్యయంతో కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం తాళ్లపాలెం గ్రామంలో'లార్జ్ అమ్యూజ్మెంట్ పార్క్ కమ్ రిసార్ట్' ను నిర్మించేందుకు 20 ఎకరాలు కేటాయించబడింది. తీర ప్రాంతంలో ఆతిథ్య, వినోద కేంద్రానికి కేరాఫ్ అడ్రస్ గా నిలవనున్న ఈ ప్రాజెక్టులో 30,000 చదరపు అడుగులలో అమ్యూజ్మెంట్ పార్క్, 25,000 చ.అ.లలో వాటర్ పార్క్ & రైడ్లు, 150 గదులు, ఐదు రెస్టారెంట్లు మరియు బార్, 16,000 చ.అ.ల కన్వెన్షన్ సెంటర్, వెల్నెస్ స్పాలు, స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు కానున్నాయి. తద్వారా 380 మందికి ప్రత్యక్షంగా, 600 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా 99 సంవత్సరాలకు రాష్ట్ర ప్రభుత్వానికి లీజు ద్వారా వచ్చే ఆదాయం అంచనా రూ. 12.81 కోట్లు. 99 సంవత్సరాలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వాటా (revenue share) అంచనా రూ. 119.17 కోట్లు గా పర్యాటక శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ ప్రకారం ఎకరా 26.67 లక్షలు కాగా 20 ఎకరాలకు దాదాపు రూ. 5.33 కోట్లు అవుతుంది. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా ప్రభుత్వానికి ప్రత్యక్ష, పరోక్ష పన్ను ఆదాయం, ప్రాంతీయ ఆర్థిక ప్రయోజనాలతో పాటు తీర ప్రాంత అభివృద్ధికి బీజం పడనుందని పర్యాటక శాఖ పేర్కొంది.
Comments
Post a Comment