మచిలీపట్నం :
జిల్లాలో పెండింగ్లో ఉన్న 430 రెవెన్యూ క్లినిక్ అర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
మంగళవారం జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ తో కలసి నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో రెవెన్యూ అధికారుల సమావేశం నిర్వహించి రెవెన్యూ క్లినిక్లు, కోర్టు కేసులు, మీకోసం... పిజిఆర్ఎస్ అర్జీల పరిష్కారం, కుటుంబ ధ్రువీకరణ పత్రం, ఈ...కార్యాలయం, ముటేషన్లు, పట్టాదారు పాసుపుస్తకాలు, 22 ఏ భూములు, రీసర్వే, ఇళ్ల స్థలాలు, సీనియర్ సిటిజన్, ఎన్నికలు తదితర అంశాలపై మండలాల వారీగా సుదీర్ఘంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూ క్లినిక్ల సందర్భంగా 804 దరఖాస్తులు అందాయని, వాటిలో ఇప్పటివరకు 106 దరఖాస్తులు పరిష్కరించడం జరిగిందన్నారు. మరో 61 దరఖాస్తులు అంగీకరించి తదనుగున ప్రక్రియలో ఉండగా 207 దరఖాస్తులు తిరస్కరించగా 430 దరఖాస్తులు ఇంకను పెండింగ్లో ఉన్నాయన్నారు. దరఖాస్తుల పరిష్కారంలో ఎందుకంత ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నిస్తూ వాటిపై ప్రత్యేక దృష్టి సారించి త్వరగా పరిష్కరించాలన్నారు.
ఎఫ్ఎల్ ఆర్ , ఆర్ ఎస్ ఆర్ రికార్డులు పరిశీలిస్తే చాలా వరకు దరఖాస్తులు పరిష్కరించవచ్చని సూచించారు.
మీకోసం అర్జీలు 13,360 అందగా అందులో 11,468 అర్జీలు పరిష్కరించాలని, అందులో 348 అర్జీలు గడువు దాటి ఉన్నాయన్నారు. ఇకనైనా అర్జీలను నిర్ణీత గడువులోగానే పరిష్కరించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 22- ఏ నిషేధిత భూముల పై అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని, జిల్లాలో ఇప్పటివరకు ఆ జాబితా నుండి తొలగించాలని 446 దరఖాస్తులు వచ్చా యని, అందులో అత్యధికంగా బాపులపాడు మండలంలో ఉన్నాయని, వాటన్నిటిని పరిశీలించి సజావుగా పరిష్కరించాలన్నారు.
జిల్లాలో 573 రిట్ పిటిషన్లకు కౌంటర్లు ఇంకను వేయాల్సి ఉందని, ఇకపై ఎలాంటి ఆలస్యం, అశ్రద్ధ చేయకుండా కౌంటర్ అఫిడవిట్లు 10 రోజుల్లో తయారుచేసి కోర్టుకు సమర్పించాలన్నారు. జిల్లాలో హిట్ రన్ 21 కేసులు, సీనియర్ సిటిజన్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక తీవ్రతర సవరణ( ఎస్ఐఆర్) కార్యక్రమం లో భాగంగా 4.5 లక్షల ఓటర్లను మ్యాపింగ్ ఇంకా చేయవలసి ఉందన్నారు.
సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ రీ సర్వేలో ఎఫ్ లైన్ ప్రక్రియ సరిగా పరిశీలన చేయడం లేదని ఇకనైనా సరిగా గమనించి చేయాలన్నారు. అడంగల్ సరిదిద్దడంలో గాని, ముటేషన్లు చేయడంలో గాని ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. రెవెన్యూ క్లినిక్లు ఏర్పాటు చేసిన ఉద్దేశం ప్రజలకు త్వరగా మేలు జరగాలని కానీ ఆ ప్రయోజనం నెరవేరడం లేదన్నారు.
దీంతో ప్రజల సానుకూల దృక్పథం లో రెవెన్యూ శాఖకు 59% మాత్రమే ఉందన్నారు. కోర్టు ధిక్కరణ కేసులు 31 పెండింగ్లో ఉన్నాయని వాటికి సంబంధించి వెంటనే కౌంటర్లు దాఖలు చేయాలన్నారు. మీకోసం అర్జీలలో ఎక్కువగా నాగాయలంక, గుడ్లవల్లేరు మండలాల్లో పెండింగ్ లో ఉన్నాయని, గడువు వచ్చేంతవరకు ఆగకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోనే పరిష్కరించాలన్నారు. తాజా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం 22- ఏ భూముల జాబితాలో ఉన్న ఏపీఐఐసీ స్థలాలను తొలగించాలన్నారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ చంద్రశేఖర రావు మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు ఆర్డీవోలు సాంబశివరావు, బాలసుబ్రమణ్యం, శ్రీదేవి, విజిలెన్స్ అధికారి పీజిఆర్ఎస్ నోడల్ అధికారి పోతురాజు, ప్రొబేషనరీ ఉప కలెక్టర్ నిఖిల శ్రీ, సర్వే భూ రికార్డుల ఏ డీ లక్ష్మణ్ బాబు, ఏపీఐఐసీ జెడ్.ఎమ్. బాబ్జి, పలువురు మండల తహసిల్దారులు, మున్సిపల్ కమిషనర్లు, సర్వేయర్లు, డీటీలు పాల్గొన్నారు.
Comments
Post a Comment