మచిలీపట్నం :
చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను స్వయంగా పరిశీలించి, ప్రమాదానికి దారి తీసిన కారణాలను తెలుసుకున్నారు.
ఇటీవల చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా విక్రయిదారులు, తయారీదారులు అనధికారికంగా నిల్వ ఉంచిన బాణసంచా పదార్థాలను సీజ్ చేసి, కోర్టు ఉత్తర్వుల మేరకు డిస్పోస్ చేసే క్రమంలో చల్లపల్లి పోలీస్ స్టేషన్ వెనుక వైపు గల గది నుండి బాణసంచాను వాహనంలోనికి ఎక్కించే క్రమంలో వాహనంలో అట్ట పెట్టి అడుగుభాగం ఒక్కసారిగా ఓపెన్ కావడంతో అందులో ఉన్న బాణసంచా కిందపడి పేలడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై దుర్గ ఆంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ తేజ, కానిస్టేబుల్ అబ్దుల్లా, డ్రైవర్ నాగరాజు సహా ఇతర సిబ్బంది గాయపడ్డారు.
ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, పరిస్థితులను సమీక్షించారు. ప్రమాదానికి కారణాలపై సవివరంగా విచారణ జరిపి, అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి సమాచారం సేకరించారు.
అనంతరం గాయపడిన సిబ్బందికి చల్లపల్లిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఎన్నారైఆసుపత్రికి తరలించారు. ఎన్నారై ఆసుపత్రి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న సిబ్బందిని ఏలూరు రేంజ్ ఐజిపి జి.వి.జి.అశోక్ కుమార్ ఎస్పీ గాయపడిన సిబ్బందిని పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు.
సిబ్బందిని మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వైద్య పర్యవేక్షణకై డిఎంహెచ్వో యుగంధర్ ని ఆస్పత్రికి పంపించినట్లుగా తెలిపారు.
సిబ్బంది కుటుంబ సభ్యులతో మాట్లాడి, “మీకు అండగా మేమున్నాం, దిగులు పడవద్దు. మెరుగైన వైద్యం అందించడం పోలీస్ శాఖ బాధ్యత” అని భరోసా ఇచ్చారు.అలాగే వైద్యం అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడి గాయాల తీవ్రత, ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకుని, అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని తెలిపారు. సిబ్బంది యొక్క కుటుంబ సభ్యులకు సహకారం అందించడానికి ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అన్ని పోలీస్ స్టేషన్లలో సీజ్ చేసిన ప్రమాదకర పదార్థాల నిల్వ, తరలింపు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Post a Comment